పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
దుర్విషహప్రభృతి కురుకుమారులు భీమునిచేఁ జచ్చుట (సం. 9-24-41)
క. పాంచాలకుమారాదు లు | దంచిత భుజబలము మెఱయ నమ్ములవెల్లిన్‌
ముంచిరి నిజకరిహరి రథ | సంచయసంరంభ మెసఁగ జగతీనాథా!
366
వ. అప్పు డేను ధృష్టద్యుమ్నునిబారి కొక భంగిఁ దొలంగఁ దప్పియు నద్దెస నుద్దామగతి చతుశ్శతస్యందనములతో నడరు సాత్యకిచేతఁ బట్టువడితి; నట్టియెడ వడముడి కుంజర ప్రకరభంజనవిహరణపారీణతం బేర్చి యార్చినం జూచి నీ కొడుకులు దుర్విషహ దుష్ప్రదర్శన ప్రముఖులు శితశిఖంబులు గురియుచుం గవిసి యబ్బలుమగనిం బొదివిన నతండు రథం బెక్కియెక్కుడుమదంబున భల్లనారాచాదిబాణంబులఁబ్రాణంబులు గొనినం గనుంగొని హతశేషంబైన భవదీయబలంబు గ్రోధశోకావేశంబున నవ్వీరుఁ జుట్టుముట్టిన నాజెట్టిజోదు పంచశత రథంబులును దంతిశతసప్తకంబును దురంగాష్టశతంబును బదాతిదశసహస్రంబును దనసాయక సముదయంబుల వేగంబున సమయునట్లుగా సంక్రీడనంబు సూపినం దక్కటివారు దేఱిచూడనుం జాల కంతంత నిలువ భవత్కుమారమారణం బప్రతిహతంబై చెల్లుటకు నుల్లంబు వికసిల్లె. శిష్టైకసోదరుండైన సుయోధనునిఁ దెగినవానిన కాఁ గొని తన్ను నప్పుడు కృతార్థునింగాఁ దలంచుచు మల్లచఱచినం గించిదవశిష్టంబైన యాకౌరవసైన్యంబు వెగడంది ఱిచ్చవడియె. నయ్యవసరంబున గుఱ్ఱపుఁ దండంబులతో సుదర్శనుండు దాను నున్న సుయోధను నాలోకించి గోపాలదేవుండు దేవేంద్రపుత్రున కిట్లనియె. 367
సీ. ‘అరు లడంగిరి యుధిష్ఠిరుఁ డాది యగు భవ | ద్భ్రాతలు నీ పరిపాలనమున
నుల్లసిల్లిరి సంజయుని బాడుదల వట్టి | కొని వచ్చి సాత్యకి వినుతి కెక్కె
నెలమి ధృష్టద్యుమ్నుఁ డెంతయు నొప్పె ని | ప్పుడ కూడి తఱుము మీప్రోవుగట్టి
నిలిచిన హయములం బొలియింపవలయు నిం | దున్నాఁడు చూచితె? యొడ్డు చక్కఁ
 
తే. గా నమర్చుచుఁ జూడ్కులు గలయదెసల | బొరి నిగుడ్చుచు ధృతరాష్ట్రపుత్రుఁ డల్ల
వాఁడె! తెల్లనిగొడుగుతో వాఁడి దక్కి | నివురు గప్పిన నొప్పఱు నిప్పువోలె.
368
క. ఇతనిని భవదీయోజ్జ్వల | శితనారాచప్రసారశీఘ్రాభీలో
ద్ధతి గతజీవితుఁ జేయుము | గృతకృత్యుఁడ వగదు జగము గీర్తింపంగన్‌.
369
క. వినుము ధృతరాష్ట్రనందను | లనిలతనయుచేతఁ బొలిసి రందఱు నిం కొ
క్కనుజుండు నితండును ని | ల్చిన వా రయ్యిరువు రిపుడు చెల్లెద రెట్లున్‌’.
370
వ. అనిన విని సవ్యసాచి సవినయంబుగా నయ్యంబుజాక్షు వీక్షించి. 371
చ. అమరనదీతనూభవుని నస్త్రకళాగురుఁ గర్ణునిన్‌ మహా
సమరమునం దనేక బలసంఘములన్‌ బలవన్నృపాలవ
ర్గములను మద్రరాజుఁ దుదిగాఁ దెగటార్చె భవత్ప్రసాదది
వ్యమహిమ యింక నల్పతరవైరి సమూహము దాని కడ్డమే?
372
వ. ఇన్నూఱు రథంబులు నూఱేనుంగులు రెండువేల కాలుమానిసియు సౌబలునితోడి యేనూఱుగుఱ్ఱంబులు నింతియ కాదె యీసేన! యిది కృపాశ్వత్థామకృతవర్మలు గలసి నిలుప నిలిచినయది యేను దఱి యఱుముట కలిగెనే నింతపట్టును బరిమార్చెద నిమ్మూఁక పడియును బాఱియుం దనచుట్టు బయలైన సుయోధనుం డెట్లయ్యెడివో యటు సూడుము. మార్కొనియెనేని మదీయ మార్గణాగ్నికి నాహుతి సేసి కపటద్యూతంబున నపహృతంబులైన సకలధనంబులు నలుఁగుమొన మరల్చినవాఁడనై పాండవాగ్రజుని చింతవంత యంతయుఁ బుచ్చివైచెద. నేఁ డెల్లపనులు సక్కనయ్యెడుఁ. గరిపురపురంధ్రీజనులు తమపతులుఁ బుత్రులుం బొలియుట విని పాండవు లుద్దండ బాహువీర్యశౌర్య సమగ్రులని యెఱింగెదరుగాక!’ యనుటయు నన్నరుమాటకు మెచ్చుచు నతండు. 373
చ. అరదము గౌరవేంద్రుదెసకై నడపంగఁ గెలంకులం గడం
గిరి నకులానుజన్ముఁడును గీచకవైరియుఁ గౌరవేశ్వరుం
బొరిగొన నుత్సహించి వడి భూవర! వారి కెదిర్చె సౌబలుం
డరిబలముం దదీయ రథికావలియున్‌ వినుతింప నుగ్రుఁడై.
374
వ. తక్కటివారు నుక్కెక్కి పురికొని రా శకునియు సుశర్ముండును సవ్యసాచిని సుదర్శనుండు సమీరనందనుని నీయగ్రనందనుండు సహదేవునిం దలపడి రట్టియెడ. 375
క. వడముడిఁ దలమిగిలి రయం | బడరఁగ సహదేవుఁ డత్యుదగ్రత మెఱయం
దొడరి భవత్సుతు మార్కొని | నిడుదవెడఁదతూపులేసి నెఱిఁ దూలించెన్‌.
376
ఉ. కట్టియ వైచె నెన్నుదురు గాఁడ భవత్తనయుండు మాద్రి లేఁ
బట్టి నతండు సోలియును బాహిరపోవక తేరి యా విభుం
గిట్టి నిశాతబాణచయకీలితదేహునిఁ జేసె రావుతుల్‌
కట్టుపకాసులై నరునిఁ గప్పిరి శక్తులఁ దోమరంబులన్‌.
377
వ. గాంధారదేశీయు లగు నాశ్వికులట్లు పొదివిన నొదవినకినుకఁ గ్రూరభల్లంబుల శిరంబులు ధరం దొరిఁగించినఁ ద్రిగర్తస్యందనసందోహం బడరి గోవిందపురందరపుత్రులపైఁ బటుప్రదరపరంపరలు వరఁగించి విజృంభించిన నవ్విజయుండు. 378
సీ. సత్యకర్మునితల చారుకుండల పరి | స్ఫురితత్వ మొందుచు ధరణి డొల్ల
నేసి మృగంబుపై కెరఁగుసింగమపోలెఁ | గిట్టి సత్యేషుని గీ టడంచి
బహుదినసంచితప్రకటకోపానల | జ్వాలలు సాకారలీలఁ బర్వు
తెఱంగున నరుణదృగ్దీప్తిజాలంబు సు | శర్ముపై నిగిడించి సాయకత్ర
 
తే. యం బొడల నాటుటయుఁ దద్రథంబు లొక్క | పెట్టఁ గవిసిన నన్నిటిఁ బిలుకుమార్చి
రథ్యములఁ గూల్చి యతనియురంబు ఘోర | భల్లమున వ్రచ్చి నిర్జితప్రాణుఁ జేసె.
379
వ. ఇవ్విధంబునఁ ద్రిగర్తపతిం బ్రేతపతిపాలి కనిచి మనదెస జనంబులు ఖేదంబుం దమవారు మోదంబు నొంద నతని నందనుల నేడ్వుర నెనమండ్ర ముప్పదుండ్ర మూఁడు మూఁడు గోలలం దలలు నఱికెఁ. దత్సైన్యశేషంబు బారిసమరె. భీమసేనుబారింబడిన సుదర్శనుండు దదీయశరజాలంబున నదర్శనగతుండై పదంపడి తచ్ఛరవిఖండితకంఠుండైనఁ గోపంబు దీపింప వగమిగుల నక్కుమారుమూఁక యమ్మారుతసుతుఁ జుట్టు ముట్టిన నతండు బెట్టిదంబులగు తూపుల నది రూపడంగు నట్లేపున విహరింపఁ గనుంగొని సహింపక మహీపతిముందటిబలంబు బరవసంబునం గవిసిన నక్కౌంతేయసైన్యంబున సరభసంబున నెదిర్చి పేర్చిన సమయంబున సౌబలుండును సహదేవుం దాఁకినం దత్సుతుం డులూకుండు బాసటయై యడరె. వడముడియుఁ బిన్నతమ్మునికి బాసటయయ్యె. నా శకుని మాద్రీతనయునిఁ బ్రదీప్తభల్ల త్రయంబున నొప్పించి పదినారాచంబు లతని మేన గుప్పించినం గోపించుచు నయ్యిరువురు సాయకనికాయంబు నిగిడించిన నా గాంధారరాజు మొగ్గరంబునఁ గత్తళంబులు గరవాలంబులు పల్యాణంబులు మోరలు గంఠంబులు చరణంబులు గరంబులు శిరంబులు దునియలై తొరఁగిన ధాత్రి చిత్రాకారంబైయుండె. నిట్లు దన తురగ సముదయంబు సమయుటయుఁ జలం బెడపక నీ మఱంది యన్నకులానుజుం గిట్టి. 380
క. పెనుగడఁత దొడ్డ యత్తళ | మున వైచిన నతఁడు మూర్ఛమునిఁగి రథము మీఁ
దన పడినఁ గనలి యప్పా | వని పొదివెను గౌరవేంద్రవాహినిఁ గడఁకన్‌.
381
వ. పొదివిన యవ్వీరునారాచంబుల తాఁకున. 382
క. అది గొంత పుడమిఁ బడ ను | న్నది పాఱినఁ గని యదల్చి యవనీశుఁడు బె
ట్టిదముగ నెలుఁగు సూపెను | మద మారఁగ నబ్బలంబు మగుడు విధమునన్‌.
383
వ. ఇవ్విధంబున దొర యఱిమి తఱిమి యమ్మొన కుత్సాహంబుగాఁ జటులవాహంబగు రథంబెక్కి శకునిఁ గూడుకొని కవిసిన. 384
తే. పాండవుల సైన్యమును సముద్దండ లీల | మాఱుకొనె నంతలో మూర్ఛదేఱి నకులు
తమ్ముఁ డమ్మామపైఁ బదియమ్ము లొక్క | పెట్టఁ గ్రుచ్చి యాతనివిలు బెట్టు ద్రుంచె.
385
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )